న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ త్వరలో షాక్ ఇవ్వబోతున్నది. ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్స్ అన్నింటికీ కాల్ రికార్డింగ్ సపోర్ట్ను నిలిపివేసేందుకు సిద్ధమైంది. దీంతో వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు లేదా ఆన్లైన్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు ఆ సంభాషణను రికార్డ్ చేయడం కుదరదు. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలు మే 11 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది.
అవతలి వ్యక్తికి చెప్పకుండా ఫోన్ సంభాషణను రికార్డు చేయడం.. వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించడమేనన్నది గూగుల్ వాదన. అందుకే కాల్ రికార్డింగ్ యాప్స్ను కట్టడి చేసేందుకు ఆ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. తొలిసారి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్)లోనే కాల్ రికార్డింగ్ ఫీచర్ను తొలగించింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన యాప్ డెవలపర్లు.. అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్ఫేస్ (ఏపీఐ)ని ఉపయోగించి సరికొత్త కాల్ రికార్డింగ్ యాప్స్ను తీసుకొచ్చారు.
ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ అన్నింటికీ ఏపీఐ యాక్సెసబిలిటీని తొలగించేందుకు గూగుల్ కసరత్తు చేస్తున్నది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్బిల్ట్గా ‘గూగుల్ డయలర్’ ఉంటే తప్ప కాల్ను రికార్డు చేయడం కుదరదు. గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా సంభాషణను రికార్డ్ చేసినా అవతలి వ్యక్తికి తెలిసిపోతుంది.