ఆమె బస్ కండక్టర్. ప్రయాణికులనే కాదు.. తలసేమియా బాధితులనూ సురక్షితంగా గమ్యానికి చేరుస్తున్నది. తలసేమియా.. ప్రాణాంతక రుగ్మత. తరచూ రోగి శరీరంలోని రక్తాన్ని మార్చాల్సి ఉంటుంది. ఏ కాస్త ఆలస్యమైనా ప్రాణానికే ప్రమాదం. ఖమ్మం నగరానికి చెందిన అనిత ‘సంకల్ప’ం మీద దాదాపు రెండొందల జీవితాలు ఆధారపడి ఉన్నాయి.
సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం.. అనిత దగ్గరి బంధువుల కుటుంబంలో ఓ పసివాడు తలసేమియాతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ దురదృష్టకర సంఘటన ఆమెను కదిలించింది. ‘నా వంతుగా ఏమీ చేయలేనా?’ అన్న ఆలోచన మొదలైంది. అలా అని, ఆమెదేం సంపన్న కుటుంబం కాదు. సాధారణ జీవితం. అతి సాధారణ జీతం. భర్త రవిచంద్ర హోంగార్డు. ఇన్ని పరిమితుల మధ్య ఓ మహత్కార్యానికి పూనుకొంది. కుటుంబసభ్యులు కూడా మేమున్నామంటూ ముందుకొచ్చారు. 2010లో తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలనే లక్ష్యంతో‘సంకల్ప’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. తొలినాళ్లలో సహకరించే వారే కొరవడటంతో రక్తం కోసం ఎక్కని గడపలేదు.. అడగని సంస్థ లేదు. ‘ఎక్కువ కాలం బతకని పిల్లల కోసం ఎందుకింత ఆరాటం?’ అంటూ నిరుత్సాహ పరిచినవాళ్లే ఎక్కువ. ఆమె మాత్రం కుటుంబసభ్యుల అండతో రక్త సేకరణకు నడుం బిగించింది. తలసేమియా వంటి భయంకర వ్యాధితో పిల్లలు అనుభవిస్తున్న నరకం, వారి తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభను సమాజానికి అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు, అనిత ‘సంకల్ప’ బలంతో తలసేమియా రోగులకు ఎంతో ఊరట లభిస్తున్నది.
రక్త సేకరణ
రెండు, మూడు బ్యాగుల రక్త సేకరణే గగనమైన పరిస్థితి నుంచి నెలకు 260 బ్యాగుల రక్తం సమీకరించే దశకు చేరుకున్నది అనిత. ఆ రక్తంతో దాదాపు రెండు వందల మంది చిన్నారుల ప్రాణాలు నిలబెడుతున్నది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. భర్త, అత్త, తోటికోడళ్ల సహకారంతో స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నదామె. ‘ఆరు నెలల నుంచి ఒకటిన్నరేండ్ల వయసులో ఈ వ్యాధిని కనుక గుర్తిస్తే సకాలంలో వైద్యం ప్రారంభించవచ్చు. బిడ్డను కాపాడుకోవచ్చు’ అంటారామె. తన ప్రయత్నంలో అనేకమంది దాతలూ అండగా నిలుస్తున్నారు. ‘సంకల్ప’కు ‘శివ బ్లడ్ బ్యాంక్’ యజమాని రాజేశ్ గార్గె సేవలు తోడయ్యాయి. ‘అంకుర’ ఆసుపత్రి వైద్యులు రాకేశ్, డాక్టర్ నారాయణమూర్తి తలసేమియా చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. కరోనా ప్రభావం తలసేమియా వైద్యం పైనా పడింది. కొవిడ్ భయంతో దాతలు వెనుకంజ వేయడంతో, రక్తం సేకరించడం కష్టమవుతున్నదని చెబుతున్నప్పుడు అనిత మొహంలో ఎంతో ఆవేదన.
… మాటేటి వేణుగోపాల్