Bus Accident | విహార యాత్రకు వెళ్లి తిరిగొస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలంటుకోవడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కనీసం 12 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బల్గేరియా రాజధాని సోఫియాలో వెలుగు చూసింది.
ఈ బస్సులో టర్కీ చూసి వస్తున్న టూరిస్టులు ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాదం నుంచి ఏడుగురు తప్పించుకున్నారు. వీళ్లంతా మంటలు అంటుకోగానే బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు. అప్పటికీ కాలిన గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. ప్రమాదానికి గురైన బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
అయితే దాన్ని ఢీకొట్టడంతో బస్సులో మంటలు అంటుకున్నాయా? లేక మంటలు అంటుకోవడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందా? లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే అంశాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ బస్సులో ఎక్కువగా మాసెడోనియన్ వాసులే ఉన్నారని, ఒక్క బెల్జియన్, ఒక్క సెర్బియన్ కూడా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లు మాసెడోనియా ప్రధాని వెల్లడించారు. దీంతోపాటు మరికొన్ని బస్సులు కూడా ఒక కాన్వాయ్లో వెళ్తున్నాయని, కానీ పెట్రోలు స్టేషన్లో ఈ బస్సు ఆగిన ఒక గంట తర్వాత ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిలో అధికశాతం 20-30 ఏళ్ల మధ్య వయసున్న యువకులు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు.