ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం(Restaurant Fire) జరిగింది. ఆ దుర్ఘటనలో సుమారు 43 మంది మరణించారు. డజన్ల సంఖ్యలో జనంగాయపడ్డారు. ఏడు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల 43 మంది చనిపోయినట్లు బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సమంత లాల్ సేన్ తెలిపారు. గాయపడ్డవారు ప్రస్తుతం ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. బర్న్ హాస్పిటల్లో దాదాపు 40 మందికి చికిత్స అందిస్తున్నారు.
ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఉన్న పాపులర్ బిర్యానీ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి మహమ్మద్ షిహబ్ తెలిపారు. చాలా వేగంగా మంటలు బిల్డింగ్లోని పై ఫ్లోర్లకు వ్యాప్తించాయి. దీంతో ఆ ఫ్లోర్లలో ఎక్కువ సంఖ్యలో జనం చిక్కుకున్నారు.
ప్రమాదం జరిగిన రెండు గంటల్లోనే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పింది. సుమారు 75 మందిని రెస్క్యూ చేశారు. ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఎక్కువ శాతం రస్టారెంట్లు, క్లాతింగ్ , మొబైల్ ఫోన్ షాప్స్ ఉన్నాయి. కచ్చి భాయ్ అనే రెస్టారెంట్లో ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయి. అయితే పై అంతస్తుల్లో ఉన్న వారు దూకడం, ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించారు.