వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మరో వారం రోజుల్లో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. కరోనాతో అతలాకుతలమైన కుటుంబ ఆర్థిక వ్యవస్థలను ఆదుకోవడానికి వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో ఈసారైనా రాయితీలు ప్రకటిస్తారన్న ఆశతో సగటు వేతన జీవులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసారి అంచనాలు అన్ని వర్గాల నుంచి ఎక్కువగానే ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ట్యాక్స్ రేట్ల తగ్గింపు
ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయ పన్ను గరిష్ఠ శ్లాబు 30 శాతంగా ఉన్నది. సర్చార్జీ, ఎడ్యుకేషన్ సెస్ వంటి వాటితో కలిపితే 42.74 శాతానికి చేరుతున్నది. అదే దేశీయ కంపెనీలకు సర్చార్జి, సెస్ కాకుండా కేవలం 25 శాతంగానే ఉన్నది. వ్యక్తిగత ఆదాయ పన్ను గరిష్ఠ శ్లాబును 30 నుంచి 25 శాతానికి తగ్గించాలన్న డిమాండ్ బలంగా ఉన్నది. అలాగే గరిష్ఠ శ్లాబును రూ.10 లక్షల నుంచి కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షలకు పెంచాలన్న డిమాండ్ కూడా ఉన్నది.
కోతలు, మినహాయింపు పరిమితులు
గత రెండేండ్లలో కుటుంబ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. పిల్లల ట్యూషన్ ఫీజు, మెడికల్ వ్యయాలు, ఇంటి అద్దెలు.. ఇలా అనేక నెలవారి ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దీంతో పొదుపు చేయడం గగనమైపోయింది. ఆదాయ పన్ను చట్టం 80సీ కింద ప్రస్తుతం ఉన్న డిడక్షన్స్ మొత్తాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని డిమాండ్ ఉన్నది. అలాగే హౌజింగ్ లోన్ మీద చెల్లిస్తున్న వడ్డీ డిడక్షన్ను ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. సెక్షన్ 80డి కింద మెడికల్ ఇన్సూరెన్స్ రాయితీని సీనియర్ సిటిజన్లకు రూ.75 వేలకు, మిగతావారికి రూ.50,000 పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా కరోనాతో ట్రీట్మెంట్ ఖర్చులు పెరగడంతో ఆరోగ్య బీమా తీసుకునేవారి సంఖ్య కుడా విపరీతంగా పెరిగింది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు స్కీముల్లో చేసే పొదుపు పరిమితి రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నది.
వర్క్ ఫ్రమ్ హోమ్ రాయితీ
గత రెండేండ్లుగా, కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల సంఖ్యే ఎక్కువ. దీంతో ఇంటర్నెట్ చార్జీలు, కరెంటు బిల్లులు, ఫర్నీచర్, అద్దెలు పెరిగాయి. వీటి కోసం చేస్తున్న వ్యయాల కోసం గరిష్ఠంగా రూ.50 వేల వరకు డిడక్షన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్గా పరిగణించాలని కోరుతున్నారు.
పీఎఫ్ కంట్రిబ్యూషన్స్పై..
ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్లో తమ వాటా కింద జమచేసే మొత్తం రూ.2.5 లక్షలను మించితే దానిపై వచ్చే వడ్డీని గత బడ్జెట్లో పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే దీన్ని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండ్ ఏడాది కాలంగా గట్టిగా వినిపిస్తున్నది. అలాగే దీనిపై పన్నును అక్యురల్ స్టేజీలో లేదా విత్డ్రాయల్ స్టేజీలో విధించాలా అనే విషయంపై స్పష్టతనూ ఫిబ్రవరి 1న తెచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఇస్తారని ఆశిస్తున్నారు. అలాగే మైనర్ పిల్లల ఆదాయంపై డిడక్షన్ను రూ.15వేలకు పెంచాలన్న వినతి ఉన్నది. ఈ డిమాండ్లలో కొన్నింటినైనా మోదీ సర్కారు నెరవేర్చగలిగితే ఆదాయ పన్ను భారం చాలావరకు తగ్గుతుంది.