అమృత్సర్: పాకిస్థాన్ సరిహద్దు వైపు నుంచి భారత్లోకి ప్రవేశించిన చైనా తయారీ డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కూల్చివేసింది. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ సెక్టార్లోని కలాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నేల కూలిన నల్ల రంగులో ఉన్న మేడ్ ఇన్ చైనా డీజేఐ మెట్రిస్ – 300 డ్రోన్ను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్థ రాత్రి దాటిన తర్వాత 1.15 గంటలకు సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందికి బజ్ శబ్ధం వినిపించింది. దీంతో పాకిస్థాన్ వైపు నుంచి భారత్లోకి ప్రవేశించిన అనుమానిత డ్రోన్ను గుర్తించారు. వెంటనే దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. అనంతరం ఆ ప్రాంతంలో సెర్చ్ చేశారు. ఉదయం 6.15 గంటలకు మరింతగా ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ధనో కలాన్ వద్ద నేల కూలిన చైనా తయారీ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు శుక్రవారం పాకిస్థాన్కు చెందిన 55 ఏండ్ల వ్యక్తి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించాడు. గమనించిన భద్రతా సిబ్బంది అతడ్ని అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. తుర్కుండి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థానీ వ్యక్తిని అరెస్ట్ చేసి మంజకోట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అతడి వద్ద ఒక గొడ్డలి, పాక్ కరెన్సీ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.