KTR | పాస్పోర్ట్ పోగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య (62)కు అండగా ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హామీనిచ్చారు. సిరిసిల్ల వాసి నర్సయ్యను భారత్కు రప్పించేందుకు కృషి చేస్తానని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్కు లేఖ రాశారు. నర్సయ్యను తిరిగి తీసుకువచ్చేలా విదేశాంగ శాఖతోపాటు రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
బహ్రెయిన్లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ (BRS NRI) విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. నర్సయ్యను వెంటనే దేశానికి రప్పించేలా చూడాలని లేఖలో కోరారు.
బతుకు దెరువు కోసం..
చాలా సంవత్సరాలుగా ఆచూకీ లేకుండా పోయిన నర్సయ్య బహ్రెయిన్లోని జైల్లో పాస్పోర్ట్ సమస్యలతో అక్కడే చిక్కుకున్నారు. 28 ఏండ్ల క్రితం బతుకు దెరువు కోసం బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య అక్కడే చిక్కుకుపోయారు. నర్సయ్య గత జనవరి నుంచి అక్కడి జైల్లో ఉన్నాడు. 1996లో బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య అక్కడి ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేండ్లపాటు తాపీ మేస్త్రీగా పనిచేశాడు. 1999 ఆగస్టులో ఆయన వర్క్ పర్మిట్ ముగిసినా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు.
ఆయన పాస్ పోర్ట్ గడువు 2001లో ముగియటంతో బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ఇప్పుడు ఆ పాస్ పోర్ట్ గడువు కూడా ముగిసింది. నర్సయ్య పాస్ పోర్ట్ పోగొట్టుకున్నాడు. వర్క్ పర్మిట్, పాస్ పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచడంతో ఆయన జైల్లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
నర్సయ్యను భారత్కు రప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి రావటంతో ఆయన స్పందిస్తూ.. నర్సయ్యను భారత్కు రప్పించేందుకు అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు నర్సయ్యకు తాత్కాలిక పాస్ పోర్ట్ను ఇచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్ని లేఖలో కోరారు.
ఈ విషయంలో పూర్తి సహకారం అందించి నర్సయ్య పాస్ పోర్ట్ జారీ అయ్యేలా చూడాలని విదేశాంగ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను విడుదల చేసి భారత్ కు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను బహ్రెయిన్ ప్రభుత్వానికి సమర్ఫించాల్సి ఉందని, నర్సయ్య గుర్తింపును ధృవీకరించాలని బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థ ‘లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ’ 2024 జనవరి 8న బహ్రెయిన్ లోని భారత రాయబారికి లేఖ రాసిందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నర్సయ్యను వెంటనే స్వదేశానికి పంపించే ఏర్పాటు చేయాలని కోరారు.
సిబ్బందికి కేటీఆర్ ఆదేశం..
ఇప్పుడు నర్సయ్యకు భారత ప్రభుత్వం తాత్కాలిక పాస్ పోర్ట్ను జారీ చేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేసి తిరిగి భారత్ కు పంపించే అవకాశం ఉందన్నారు కేటీఆర్. ప్రస్తుతం హైదరాబాద్ పాస్పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి నర్సయ్య చిరునామా కనుక్కొని సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ద్వారా నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంతోపాటు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను మరింత వేగంగా తీసుకెళ్లాలని తన కార్యాలయ సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు.