కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 18: (నమస్తే తెలంగాణ): తండాల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పరి తపించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఆదివాసీ గిరిజనుల తండాల సమగ్రఅభివృద్ధికి నిరంతరం ఆలోచన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాల సృష్టికర్త కేసీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సుజాతనగర్ మండలం, సర్వారం తండాలో గిరిజనులు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
కేసీఆర్కు క్షీరాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా సత్యనారాయణ నాయక్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి కేసీఆర్ పెంచారని వెల్లడించారు. 6 లక్షల మందికి పైగా పోడు పట్టాలు, 183 గిరిజన గురుకులాలు ఏర్పాటు,
4,146 తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అదనంగా గిరిజన బిడ్డలకు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల అవకాశం కల్పించారని కేసీఆర్ను ఆయన కొనియాడారు.

ట్రైకార్, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా సబ్సిడీ రుణాలు, గిరిజన విద్యార్ధుల విదేశీ విద్యకు రూ.20లక్షల ఆర్ధిక సహాయం, హైదరాబాద్ నడి బొడ్డున గిరిజనుల ఆత్మ గౌరవ ప్రతీకగా సేవాలాల్ మహారాజ్ పవన్, కొమరం భీమ్ భవన్ లు నిర్మించిన కేసీఆర్ గిరిజనుల ఆరాధ్య దైవంగా నిలిచారు ఆయన పేర్కొన్నారు. కానీ.. నేడు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ట్రైకార్, ST సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా ఎత్తి వేసిందని, గిరిజనులపై దాడులు జరిగితే పట్టించుకునే నాధుడే లేడు అని సత్యనారాయణ నాయక్ వాపోయారు.
లగచర్ల సహా, ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, గురుకులాలను రద్దు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గిరిజనుల బతుకులు బాగుపడాలి అంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఆ దిశగా గిరిజన బిడ్డలందరూ ఐక్యంగా నిలబడి పోరాడాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సర్వారం వార్డు నెంబర్లు మాలోత్ రాందాస్ నాయక్, మాలోత్ కల్యాణి, పార్టీ నాయకులు మాలోత్ కుమార్, పెరుగు లక్ష్మీనారాయణ, మాలోతు, చంద్రు, నునావత్ బద్రు, మాలోత్ దేవా, భూక్యా భీముడు, దేవేందర్, రఘు, సేట, మాలోత్ దేవి, మాలోత్ రాంబాయి, మాలోత్ గౌతమి, మాలోత్ సోనా, మాలోత్ మానా, సుశీల, బద్రి, జ్యోతి బాయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు