హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ) : బూత్ లెవల్ అధికారులు(బీఎల్వోలు) ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు సకాలంలో అందించడం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియలో బీఎల్వోల తీరుపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డిని సోమవారం కలిసింది. వినోద్కుమార్ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్, నాయకులు కర్నె ప్రభాకర్, వై సతీశ్రెడ్డి, సుమిత్రానంద్ తదితరులు బీఆర్కే భవన్లో సీఈవోను కలిసి ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలు, లోపాలపై వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, బీఎల్ఏల సమన్వయంతో ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు చాలా వినతులు వచ్చాయని, వాటిని సీఈవోకు అందించామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చాలామందికి దరఖాస్తు పత్రాలు అందలేదని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా 20రోజుల సమయం మాత్రమే ఉన్నందున, మరికొంత కాలం గడువు పెంచాలని సీఈవోను కోరినట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాలు వెల్లడిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఒకే ఓటరుకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయని, ఇలాంటి డూప్లికేట్ ఓట్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్ల మార్పులు, తప్పుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నదని, వీటిని సరిదిద్దేందుకు బీఎల్వోలకు తగిన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.