హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసలు కురిపించారు. ఈ పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయంటూ కితాబిచ్చారు. ఈ మేరకు గురువారం మంత్రుల నివాసంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆయన కలిశారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలను మంత్రి ఆయనకు వివరించారు. దీంతోపాటు బ్రిటన్ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, ఎగుమతులు, దిగుమతులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మంత్రిని కలిసిన వారిలో నళిని రఘురామన్, ప్రణీత్వర్మ, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.