మెదక్, డిసెంబర్ 11: ఉల్లినారు సాగుతో లాభాల పంట పండిస్తున్నారు మెదక్ మండలంలోని మక్త భూపతిపూర్ రైతులు. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందుతున్నారు. విభిన్న పంట సాగుతో అధిక లాభాలను ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయల సాగు కంటే ఉల్లినారు మేలు అని ఊరంతా ఉల్లినారు సాగు వైపునకు మళ్లింది. ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెట్టి రూ.3 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు. కేవలం రెండు నెలల్లోనే పెట్టిన పెట్టుబడి పోను రూ.2.20 లక్షల వరకు లాభాలు గడిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఉల్లినారుకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది.
45 రోజుల్లో విక్రయానికి రెడీ
గ్రామంలో 465 కుటుంబాలు, 1,839 జనాభా ఉన్నది. ఇందులో 200 కుటుంబాలు 25 ఏండ్లుగా ఉల్లి నారు సాగుతో ఉపాధి పొందుతున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉల్లి విత్తనాలను నాటుతారు. కిలో ఉల్లి విత్తనాలకు రూ. వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వెచ్చిస్తారు. 45 రోజులకు ఉల్లి నారు తయారవుతుంది. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో ఉల్లినారుకు మంచి డిమాండ్ ఉంటుం ది. ఈ సమయంలో రైతులు ఉల్లినారు ను పీకి కట్టలు కట్టి మెదక్, తూప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్, సిద్దిపేట జిల్లా దుబ్బాక, దౌల్తాబాద్, కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ప్రాంతాల్లో అమ్ముతుంటారు. ఎకరం ఉల్లినారు సాగుకు పెట్టుబడి రూ.80 వేలు ఖర్చవుతుండగా, రెండు నెలల్లోనే దాదాపు రూ.3 లక్షల ఆదాయం పొందుతున్నారు.
సీజనల్ పంటలతో అధిక ఆదాయం
రైతులు ఉల్లినారుతోపాటు సీజన్కు అనుగుణంగా పంటలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. యువత కూరగాయలు, ఆకు కూరల సాగుపై దృష్టి సారించి నిత్యం ఆదాయం పొందుతున్నారు.
పెట్టుబడి భారం కాదు
ఉల్లినారుకు అయ్యే పెట్టుబడి చాలా తక్కువ. పైగా ఎరువులు, రసాయనిక మందుల అవసరం ఉండదు. అందుకే ఉల్లి నారు పెట్టుబడి భారం కాదు. మార్కెట్ డిమాండ్ను బట్టి ఉల్లినారు సాగు చేస్తే లాభాల్లో ఉల్లిని మించిన పంట లేదు.
నారుకు మంచి డిమాండ్
ఉల్లినారు, ఇతర ఆకు కూరలు తక్కువ సమయంలో చేతికి వస్తా యి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఉల్లినారుతో నిత్యం ఆదా యం వస్తున్నది. యాసంగిలో ఉల్లినారుతో అధిక లాభం వస్తున్నది.