హైదరాబాద్ సిటీబ్యూరో/బేగంపేట్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు దేశంలోనే తొలిసారి అత్యాధునిక పద్ధతిలో ‘బ్రీతింగ్ లంగ్’ (ఎక్స్వివో ఆర్గాన్ పెర్ఫ్యూజన్ సిస్టమ్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాథమిక స్థాయి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ మధ్యవయసు రోగి గత ఆగస్టు నుంచి రోజూ 10 లీటర్ల ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్టు కిమ్స్ ఊపిరితిత్తుల మార్పిడి విభాగం డైరెక్టర్ డాక్టర్ సందీప్ అత్తావర్ మీడియాకు వెల్లడించారు. దీన్ని ఊపిరితిత్తుల మార్పిడి ప్రక్రియలో గణనీయ మార్పుగా అభివర్ణించారు. ఇప్పటివరకు అమెరికా, కెనడా, ఆస్ట్రియా లాంటి దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ శస్త్రచికిత్సతో కోల్డ్ ఇష్కెమియా వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తగ్గి ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు.
మార్పిడికి ముందే ఇన్ఫెక్షన్ తొలగింపు
ఈ పద్ధతిలో దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తిని ‘ఆర్గాన్ రీకండీషనింగ్ బాక్స్’లో పెట్టి న్యూట్రియంట్ సొల్యూషన్స్, యాంటిబయాటిక్స్, ఇతర ద్రావణాలతో శుభ్రపరుస్తారు. దీంతో ఆ ఊపిరితిత్తిలో ఉన్న ఇన్ఫెక్షన్, వేస్టేజీ తొలగిపోతాయి. ఆ తర్వాత బ్రాంకోస్కోపీ ద్వారా వాయునాళాలను శుభ్రపరిచి వాటి పనితీరును నిర్ధారించుకొన్న తర్వాతే రోగికి అమరుస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఊపిరితిత్తిని రోగి శరీరం సులువుగా స్వీకరిస్తుందని, ఆ రోగి ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా తేలికగా శ్వాస తీసుకోగలుగుతాడని డాక్టర్ సందీప్అత్తావర్ వివరించారు. సమావేశంలో కిమ్స్ సీఈవో డాక్టర్ అభినయ్ బొల్లినేని, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజీ చీఫ్ డాక్టర్ విజిల్ రాహులన్ తదితరులు పాల్గొన్నారు.