బ్రసిలియా : కొవిడ్ టీకాల సరఫరాకు భారత్ బయోటెక్తో చేసుకున్న 324 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళవారం తెలిపారు. టీకాల కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొవాగ్జిన్ 20 మిలియన్ మోతాదుల కొనుగోలు ఒప్పందం బోల్సోనారోకు తలనొప్పిగా మారింది. సస్పెన్షన్ కొనసాగుతున్న సమయంలో ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి మార్సెలో క్యూరోగా మీడియా సమావేశంలో తెలిపారు. సీజీయూ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు లేవని, అయితే.. మరింత లోతైన విశ్లేషణ కోసం ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టీకా పరీక్షలు పూర్తి కాకముందే, అధిక ధరలకు ఆ టీకా కోసం ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తును ప్రారంభించారు. మహమ్మారిని ప్రభుత్వం నిర్వహించడంపై దర్యాప్తు చేస్తున్న సెనేట్ ప్యానెల్ సైతం ఒప్పందాన్ని పరిశీలిస్తోంది.