లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు తన పదవి నుంచి తప్పుకున్నారు. మంత్రుల వ్యతిరేకతతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా బోరిస్ జాన్సన్ తప్పుకున్నారు. అక్టోబర్లో జరిగే భేటీలో కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు.
జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ 54 మంది మంత్రుల రాజీనామాతో ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు ఆయన అంగీకరించారు. క్రిస్ పించర్పై లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణల గురించి తెలిసినా ఆయనను డిప్యూటీ విప్గా నియమించడం పట్ల కన్జర్వేటివ్ ఎంపీలు జాన్సన్పై మండిపడుతున్నారు. మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్లు జాన్సన్ తీరును ఆక్షేపిస్తూ రాజీనామా చేయడంతో పలువురు మంత్రులు ఇదే బాటపట్టారు.
మరోవైపు నూతన కన్జర్వేటివ్ నేత ఎన్నికయ్యే వరకూ బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగుతారని బీబీసీ పేర్కొంది. జాన్సన్ తన రాజీనామాను ధ్రువీకరించిన అనంతరం తదుపరి ప్రధానిని నిర్ణయించేందుకు కన్జర్వేటివ్ నాయకత్వ ఎన్నిక వివరాలు వెల్లడికానున్నాయి. ఇక 2019లో లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్ పించర్కు కేబినెట్లో సీనియర్ సభ్యుడిగా జాన్సన్ నియమించడం బ్రిటన్లో దుమారం రేపింది.
పించర్పై లైంగిక ఆరోపణల విషయం జాన్సన్కు తెలియదని జులై 1న బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇది వాస్తవం కాదని, ఈ ఆరోపణల గురించి ప్రధానికి తెలుసని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాని అసత్యం చెబుతున్నారని 2015 నుంచి 2020 వరకూ బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో సీనియర్ అధికారిగా పనిచేసిన సైమన్ మెక్ డొనాల్డ్ ఆరోపించడం కలకలం రేపింది. ఆపై పించర్ను ప్రమోట్ చేసే విషయంలో పొరపాటు జరిగిందని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ అంగీకరించారు.