జూలై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు
గోల్కొండ బోనాలతో ఉత్సవాలు షురూ
వచ్చే నెల 28న గోల్కొండ బోనాల ముగింపు
ఆషాఢ బోనాలకు సన్నాహాలు
26 దేవాలయాల్లో పట్టువస్ర్తాల సమర్పణ
వైభవంగా ఉత్సవాల నిర్వహణకు రూ. 15 కోట్లు మంజూరు
3వేల ప్రైవేటు ఆలయాలకు ఆర్థికసాయం
బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రజాప్రతినిధుల సమీక్ష
ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలకు నగరం సన్నద్ధమవుతున్నది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ లాల్దర్వాజ, 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంసృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించింది. రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28వరకు బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. 30న గోలొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్, 24వ తేదీన హైదరాబాద్ బోనాలు, 28న గోల్కొండ బోనాలతో ముగించనున్నారు.
హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రవిగుప్తా, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి, ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, కలెక్టర్లు శర్మన్, అమయ్, వాటర్ వర్స్ ఎండీ దాన కిషోర్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, అంబర్ పేట మహంకాళి దేవాలయం, గోలొండ దేవాలయం, ఉమ్మడి దేవాలయాలు తదితర దేవాలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో.. పక్కాగా ఏర్పాట్లు..
సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్రీన్లు, త్రీడీ మ్యాపింగ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంసృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు, ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇంకా ఏమైనా ప్రభుత్వ పరమైన ఏర్పాట్లు అవసరమైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక హాయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెండేండ్లుగా కరోనా కారణంగా బోనాలను ఘనంగా జరుపుకోలేకపోయినట్లు చెప్పారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.