ముంబై : బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్కు బాంబే హైకోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్పై విచారణ కోసం ఈ నెల 22న ముంబై పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఈ నెల మొదట్లో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 25 వరకు కంగనాను అరెస్టు చేయబోమని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న అనంతరం సిక్కులపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చితకబాదినట్లు.. బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్లో ఒక సిక్కు సంస్థ ఫిర్యాదు చేసింది.
మతపరమైన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిన ఆరోపణలపై కేసు నమోదైంది. అలాగే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చాలా చోట్ల కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ద్వేషపూరిత పోస్ట్లను చేసినందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆమెకు కల్పించిన భద్రతతో పాటు పద్మశ్రీ అవార్డును సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల ఆమె పంజాబ్ కిరాత్పూర్లో ఉన్న సమయంలో నిరసన తెలిపిన రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. చేతుల్లో జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. రైతులు, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. దాదాపు రెండు గంటల తర్వాత కంగనా క్షమాపణలు చెప్పడంతో రైతులు ఆమెను వదిలిపెట్టారు.