ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు మండిపడింది. దవాఖానాల్లో వైద్యులపై, ఇతర సిబ్బందిపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్రంగా స్పందించింది. ఆస్పత్రి సిబ్బందిపై దాడుల ఘటనలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో, వారి రక్షణకు ఏయే చర్యలు చేపట్టారో తెలియజేయాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. రోగుల కుటుంబ సభ్యులు చేస్తున్న దాడుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడింది. న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, జీఎస్ కులకర్ణితో కూడిన ధర్మాసనం ఆరోగ్య శాఖ ఉపకార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్ను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. దవాఖానాలపై దాడుల వ్యవహారంలో వివరాలు కావాలని కోర్టు ఆదేశించగా ఉపకార్యదర్శి ఎలాంటి వివరాలు లేకుండా అఫిడవిట్ దాఖలు చేశారని కోర్టు పేర్కొన్నది. 436 కేసులు దాఖలు చేశామని ప్రభుత్వం తెలుపగా తేదీలు, ఇతర వివరాలు కూడా కావాలని కోర్టు స్పష్టం చేసింది. “ఇది చాలా దుర్భరం అని మాత్రం మేం చెప్పగలం. ఇది పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కిందకు వస్తుంది. డాక్టర్లను రక్షించాలని ఏమాత్రం పట్టింపు సర్కారుకు ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ డాక్టర్లు మాత్రం తమ సమస్తం త్యాగం చేయాలని ప్రజలు ఆశిస్తారు” అని ధర్మాసనం పేర్కొన్నది. వారం రోజుల్లో అన్ని వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.