న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఇరాన్కు చెందిన ఓ ప్యాసింజర్ విమానంలో బాంబు ఉన్నట్టు పాకిస్థాన్లోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేసిన ఓ హెచ్చరిక కలకలం రేపింది. చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్తున్న ఈ విమానం (మహాన్ ఎయిర్ఫ్లైట్ డబ్ల్యూ-581) భారత గగనతలంలోకి ప్రవేశించాక సోమవారం ఉదయం 9.25 గంటల సమయంలో ఢిల్లీ ఏటీసీకి ఈ సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు భారత వాయుసేన అప్రమత్తమైంది. రెండు ఫైటర్జెట్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆ విమానాన్ని వెంబడించింది. కొద్దిసేపటి తర్వాత బాంబు బెదిరింపు గురించి పట్టించుకోవద్దని ఇరాన్ సమాచారం ఇవ్వడంతో ఆ విమానాన్ని నేరుగా చైనాకు వెళ్లేందుకు ఐఏఎఫ్ అనుమతించింది.