బాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత మంజూ సింగ్ కన్నుమూశారు. ఆమె వయసు 74 ఏళ్లు. ఆమె మృతి పట్ల హిందీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 80వ దశకంలో టెలివిజన్తో పాటు సినిమా రంగంలో ఆమె గుర్తింపు పొందారు. పిల్లల కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంజూ దీదీగా పిలవబడ్డారు. గురువారమే ఆమె మృతి చెందినా కుటుంబ సభ్యులు ఆలస్యంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆమె తన జీవితాన్ని వృత్తికి, కుటుంబానికి అంకితం చేశారని, స్ఫూర్తినిచ్చే జీవితాన్ని కొనసాగించారని, ప్రేక్షకులకు ఓ కుటుంబ సభ్యురాలిగా మారిపోయారని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె రూపొందించిన ‘ఏక్ కహానీ’, ‘స్వరాజ్’, ‘అధికార్’ వంటి టెలివిజన్ కార్యక్రమాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ కార్యక్రమాల ద్వారా పలు అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించేవారు మంజూ సింగ్. దూరదర్శన్లో ఆమె కార్యక్రమాలు బాగా పాపులర్ అయ్యాయి. వెండితెరపై నటిగా ఆకట్టుకున్నారు మంజూ సింగ్. ‘గోల్ మాల్’, ‘వాట్ ఈజ్ యువర్ రాశీ’,‘లేడీస్ టైలర్’, ‘స్రీన్ 2’ వంటి చిత్రాలు ఆమెకు బాగా పేరు తీసుకొచ్చాయి. టెలివిజన్, సినీ రంగాల్లో ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సభ్యురాలిగా నియమించింది. ఇది నటిగా ఆమెకు దకిన గౌరవంగా చెప్పుకోవచ్చు.