ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగుదుంకుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తున్నది. భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వర్షాలకు గోదవారి ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతం గుండా వచ్చే వరద నీటితో బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అటవీ శాఖ అధికారులు ముందుస్తు జాగ్రత్తగా బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ సందర్శన తేదీలను ప్రకటించే వరకు పర్యాటకులు ఎవరు కూడా రావొద్దని, ఇందుకు సహకరించాలని అధికారులు కోరారు.