ముంబై: కరోనా నిబంధనలు పాటించనివారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై కేసు నమోదుచేసింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ కొవిడ్ ప్రొటోకాల్ పాటించకపోవడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ట్వీట్ చేసింది. అయితే ఆ నటుడి పేరును మాత్రం వెల్లడించలేదు. ‘నగర భద్రతపై రాజీ పడేది లేదు’ అని, కరోనా నిబంధనలు పాటించని ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోమారు లాక్డౌన్ విధించే పరిస్థితులు కల్పించకూడదని, ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 16,620 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 23,14,413కు చేరింది. ఇందులో 52,861 మంది మరణించారు. మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో పుణె, నాగ్పూర్, హింగోళి వంటి నగరాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. నాగ్పూర్లో వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది.