అదిలాబాద్ : జిల్లాలోని సిమెంట్ పరిశ్రమను (సీసీఐ) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో గల చెక్ పోస్ట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా మంగళవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్ లో ఐ లవ్ cci పేరిట సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు పలువురు సెల్ఫీ దిగుతూ ఫొటోలను వాట్సాప్ గ్రూప్ లు, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.