డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవిని ఎవరు అధిష్టించనున్నారో మరికాసేపట్లో తేలనుంది. అయితే సీఎం రేసులో బీజేపీ ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్ ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ధన్ సింగ్ రావత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ మంత్రిగా కొనసాగుతున్నారు. రావత్ పౌలి జిల్లాలోని శ్రీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధన్ సింగ్ రావత్తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు అజయ్భట్, అనిల్ బలూని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు, కుమాన్ ప్రాంతం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. పుష్కర్సింగ్ను ఆ పదవి వరించవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఎన్డీ తివారీ (కాంగ్రెస్) మినహా ఏ సీఎం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోలేదు.
ధన్ సింగ్ రావత్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్లో ఎంఏ పట్టా సాధించారు. అంతేకాకుండా పొలిటికల్ సైన్స్లో ఆయన పీహెచ్డీ కూడా చేశారు.
ముఖ్యమంత్రిగా మరో పది రోజుల్లో నాలుగేండ్లు పూర్తి చేసుకోనున్న త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని రావత్ను కోరారు.