కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 83,167 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కు నామమాత్రంగా 3014 ఓట్లు మాత్రమే వచ్చాయి. తుది ఫలితాల అనంతరం బీజేపీ 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 6.30 గంటల వరకు సాగింది. 22 రౌండ్లలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. అత్యధిక రౌండ్లలో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరిచింది. కొన్ని రౌండ్లలో ఇది మరింత పెరిగింది. లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీని విజయం వరించింది. హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా పడిపోయింది. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 వేల కంటే ఎక్కువ పొందిన ఈ పార్టీ తాజా ఉప ఎన్నికలో 3014 ఓట్లను మాత్రమే సాధించడంతో డిపాజిట్ గల్లంతు అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరిగింది. ప్రధాన పార్టీలతో కలిపి 30 మంది పోటీ చేశారు.