రాంచి: ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన ఎన్సీపీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, కానీ బీజేపీ సర్కారు మాత్రం దేశంలో మతం విషం నింపుతున్నదని ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీకి కోల్కతాకు వెళ్లి పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తీరిక ఉంది కానీ.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడటానికి మాత్రం సమయం దొరకడంలేదని ఎద్దేవా చేశారు.
రాంచిలో జరిగిన ఓ కార్యక్రమంలో శరద్పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రాంచి వాసి, భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి కూడా పవార్ మాట్లాడారు. భారత్ క్రికెట్కు సేవలందించిన గొప్ప వ్యక్తుల్లో మహేంద్రసింగ్ ధోని కూడా ఒకరని ఆయన కొనియాడారు. కెప్టెన్సీ కారణంగా ఆటపై దృష్టిపెట్టలేక పోతున్నానని రాహుల్ ద్రవిడ్ చెప్పినప్పుడు సచిన్ను ఆ బాధ్యత తీసుకొమ్మని కోరానని, అయితే అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు జట్టును లీడ్ చేయగలరని అడిగితే ధోనీ పేరు చెప్పారని, సచిన్ చెప్పినట్టుగానే ధోని భారత్ క్రికెట్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడని పవార్ పేర్కొన్నారు.