నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి రాత్రి దాకా సాగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర.. రైతన్నలపై బందిపోటు ముఠా యాత్రగా సాగింది. నల్లజెండాలతో రైతుల నిరసనలు.. బీజేపీ కార్యకర్తల విశృంఖల రాళ్ల దాడులతో హింసాత్మకంగా మారింది. ధాన్యం యాత్రకు బయలుదేరిన బండి ఆయన మందీమార్బలం.. హైదరాబాద్ నుంచే 50కి పైగా వాహనాల్లో కంకర రాళ్ల బస్తాలను వేసుకొని తరలివచ్చారు.
చేతుల్లో లాఠీలు, గుత్పలు పట్టుకొని కొనుగోలు కేంద్రాల్లోకి దూసుకొచ్చారు. ధాన్యం రాసులపైకి బూటు కాళ్లతో ఎక్కి తొక్కి ఆగమాగం చేశారు. కుప్పలపైకి ఎక్కొద్దంటూ రైతులు కాళ్లావేళ్లా పడినా బీజేపీ గూండాలు వినిపించుకోలేదు. తమ ధాన్యం ఆగమైతున్నదన్న రైతుల ఆక్రందనలు స్వైరవిహారం చేస్తున్న వారి చెవికెక్కలేదు. తీవ్ర ఉద్రిక్తత సృష్టించారు. దీంతో రైతులు బండి బృందంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సంజయ్ ఎక్కడికి పోతే అక్కడ ‘బండి గో బ్యాక్’ అంటూ నినాదాలుచేశారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వచ్చారు. బీజేపీ వాళ్ల ఓవరాక్షన్ సహించలేక కోడిగుడ్లు, టమాటాలు విసిరి నిరసన తెలిపారు.
బండి సంజయ్ తన పర్యటనలో ఎక్కడా యాసంగి కొనుగోళ్లపై నోరెత్తలేదు. కేవలం ‘వానకాలంలో కొనుగోలు చేయాలి.. మేం 60 లక్షల టన్నులు కొంటామని లేఖ ఇచ్చాం.. కేసీఆర్ ఎందుకు కొనడు? ఎవరి కోసం కొంటడు? మేము కొనిపిస్తాం. రైతుల కోసం రాళ్ల దాడికి కూడా సిద్ధమే’ అంటూ తన సహజ ధోరణినే ప్రదర్శించారు. యాసంగి వడ్ల గురించి చెప్పమంటే ‘ఎవరన్నారు కొనబోమని?’ అని ఓ చోట ఎదురు ప్రశ్నించారు. ‘గోదాములు ఖాళీ లేవు. అవి ఖాళీ చేయాల్సింది కేంద్రమే కదా?’ అన్న ప్రశ్నలకు జవాబు దాటవేశారు. ఎరువుల ధరపై ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పకుండా.. ‘మీకు గోనెసంచులు వస్తున్నాయా? అవి ఎవరిస్తున్నారో తెలుసా? కేంద్రమే బస్తాకు రూ.71, ట్రాన్స్పోర్టుకు రూ.41, లేబర్కు రూ.9, క్లర్క్కు రూ.40, చివరకు కేసీఆర్కు కూడా 2 శాతం కమీషన్ ఇస్తున్న’ట్లుగా లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ప్రశ్నలకు ముఖం చాటేసిన సంజయ్ తీరుపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తూ తమ వడ్ల కుప్పలు ధ్వంసం చేసేందుకే వచ్చిండ్రు గానీ.. మాకేమి లాభం అని వాపోయారు.
సంజయ్ దాడి యాత్ర ముందుగా నల్లగొండ జిల్లా శివారులోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రం నుంచి మొదలైంది. సంజయ్ రావడంతోనే.. ‘బండి గోబ్యాక్..’, ‘వడ్లు కొనలేని బీజేపీకి పర్యటించే హక్కు లేదు..’ అంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ కార్యకర్తలు నిలిచారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు అప్రమత్తమై రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో బండి వెంట భారీగా వచ్చిన బీజేపీ కార్యకర్తలు, వారితోపాటు కొందరు రౌడీషీటర్లు రైతుల వైపు దూసుకెళ్లారు.
వీరిని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ధోరణిని సహించలేని రైతులు చెప్పులు చూపుతూ, కోడిగుడ్లను విసిరి నిరసన తెలిపారు. సంజయ్ ఓ వడ్ల కుప్ప వద్ద రైతులతో మాట్లాడుతుండగానే బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తమ జెండాకు ఉన్న కర్రలతో దాడికి దిగడంతో రైతులు పరుగులు తీశారు. తర్వాత తేరుకున్న రైతులు ఎదురు తిరిగేసరికి బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ రాయి తగిలి మంగమ్మ అనే మహిళా రైతు గాయపడ్డారు. అడ్డుకుంటున్న పోలీసులపైనా దురుసుగా ప్రవర్తిస్తూ వడ్ల కుప్పల మధ్య విచ్చలవిడిగా ఉరుకులాడారు. పట్టాల్లో పోసి జాగ్రత్తగా పెట్టుకున్న వడ్లన్నీ నేలపాలయ్యాయి.
బీజేపీ కార్యకర్తల తీరుపై రైతులు అక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీళ్ల రాజకీయాల కోసం తమ వడ్లను ధ్వంసం చేస్తున్నారని తిట్టిపోశారు. రాళ్లు రువ్విన వారిలో బీజేపీకి చెందిన రౌడీషీటర్లు ప్రధానంగా ముందు నడిచారు. పక్కా పథకం ప్రకారమే బండి యాత్ర జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎవరైనా రైతులను పరామర్శించాలంటే ముఖ్య లీడర్తోపాటు పది, ఇరవై మంది నేతలు రావడం సహజం. కానీ హైదరాబాద్ నుంచే సుమారు 50కి పైగా వాహనాలతో భారీ కాన్వాయ్తో బండి బృందం వచ్చింది. ఈ హంగామా చూసిన పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
సంజయ్ పర్యటన ఆసాంతం రాజకీయంగా హైప్ కోసం, సొంత పార్టీలో హీరోయిజం కోసమేనన్నట్టు సాగింది. హైదరాబాద్ నుంచి అనుకూల మీడియాను ప్రత్యేక వాహనాల్లో వెంట తెచ్చారు. నాలుగు కుప్పల వద్ద నలుగురు రైతులతో మాట్లాడారు. అదీ తొమ్మిదంటే తొమ్మిది నిమిషాలే. ఆ కుప్పలు కూడా కేంద్రంలోకి ప్రవేశించే దారిలో ఉన్నవే. ఈ సమయంలోనూ రైతుల ఎదురు ప్రశ్నలకే సగం సరిపోయింది. 34 నిమిషాలు ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకే వెచ్చించారు. ఇంతోటిదానికి ఇంత దూరం వచ్చి ఆగమాగం చేయడం ఎందుకని అక్కడున్న రైతులు అనుకోవడం కనిపించింది.
మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద మహాతేజ రైస్ మిల్లులోకి సంజయ్ వెళ్లగానే బండి గోబ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. దీంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. సంజయ్ పర్యటన ఆసాంతం ఈ దుర్మార్గం కొనసాగింది. వేములపల్లి మండలం బుగ్గబాయి గూడేనికి చెందిన మోదుగు సైదిరెడ్డి, మరో పత్రికా విలేకరికి గాయాలయ్యాయి. విలేకరి కంటిపై బలమైన గాయం కావడంతో దవాఖానకు తరలించారు. బీజేపీ దూకుడును నిలువరించేందుకు ప్రయత్నించిన వాడపల్లి ఎస్ఐ విజయ్కుమార్పైకి బాటిల్ విసరడంతో ఆయన ముక్కుకు బలంగా దెబ్బ తగిలింది.
సంజయ్ బ్యాచ్ విధ్వంసకాండకు వ్యతిరేకంగా నల్లగొండలో మొదలైన నిరసనలు దారి పొడవునా కొనసాగాయి. దాడులకు వ్యతిరేకంగా.. రైతులతో కలిసి టీఆర్ఎస్ కార్యకర్తలు ఐకేపీ కేంద్రం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. దాడి చేసిన గుండాలను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. మార్గమధ్యంలో సంజయ్ కాన్వాయ్పై కొందరు రైతులు టమాటాలు, కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. తర్వాత మాడ్గులపల్లి మండలం కుక్కడం వద్ద రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు.
అక్కడా రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి నిరసన తప్పలేదు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయి రైతులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. వేములపల్లి మండలం శెట్టిపాలం శివారులోని మహాతేజ రైస్మిల్లు వద్ద బండి సంజయ్ ఆగారు. అప్పటికే అక్కడ మధ్యాహ్నం నుంచి వేచిచూస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నల్లజెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీన్ని సహించని బీజేపీ గుండాలు రెచ్చగెట్టే ప్రయత్నాలు చేశారు.
రైతులు ఆగ్రహంతో ఖాళీ నీళ్ల బాటిళ్లు విసరడంతో ఇదే అదునుగా బీజేపీ గుండాలు రెచ్చిపోయారు. రైస్మిల్లు వైపు ఉన్న రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తల వైపునకు రోడ్డుకు మరోవైపు ఉన్న బీజేపీ గుండాలు రాళ్లు రువ్వారు. సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించే సమయంలోనూ నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద మరోసారి రైతుల నిరసనలు తప్పలేదు. రైతుల నిరసనలు సహించలేని బీజేపీ గుండాలు ప్రతిచోటా గొడవకు సిద్ధపడ్డారు.
‘సారూ.. పోయిన ఎండకాలంలో పండించిన వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొంటే మీ మోదీ సారు తీసుకోలేదు.. అట్లనే గోదాముల్లో ఉన్నయి. ముందు వాటిని చూసిన్రా? కేసీఆర్ సారు వానకాలం వడ్లను కొంటమంటుండు. మరి ఎండకాలం సంగతేంది సారూ? పోయిన
ఎండకాలం వడ్లు గోదాముల్లో ఉంటే ఇప్పటి వడ్లు తీసుకుని యాడ దాయాలె? జాగా లేకపాయె.. మీరు వడ్లు కొనరాయె ఎట్ల సారూ? వరి పంట వేయొద్దని మోదీ సారు చెప్పిన్రు. మీరు వరి వేయాలంటున్రు. ఎవరిని నమ్మాలి సారూ? వడ్లు కొంటామని ముందు పెద్ద సారుతో ప్రకటన చేయించండి సారూ. – సందీప్రెడ్డి, రైతు
ఎవరో రమ్మన్నట్టు వచ్చి ధాన్యం కుప్పమీద పడ్డరు. వడ్లన్నీ తొక్కి ఆగమాగం చేసిండ్రు. రెండ్రోజులు వడ్లు ఎండబెట్టి కుప్ప నూకి పోయిన. ఇప్పుడు అంతా ఆగం చేసిండ్రు. మబ్బులు పడుతున్నాయి. మల్లా కుప్ప నూకి రాశి పోయాలే.. పెద్ద పని పెట్టిండ్రు.- సింగం చంద్రయ్య, పానగల్లు, నల్లగొండ మండలం
ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన బీజేపోళ్లు రాళ్లు తీసుకొని ఇసిరేసిండ్రు. నా పక్క పొంటి ఒక రాయి పడ్డది. నా చేతుల టెంక ఉంటే తలకు అడ్డు పెట్టుకున్నా. అటు పక్క వోలకో రాయి తగిలి గాయమైంది. కాసేపటి దాకా ఒణికిపోయిన. మా ఒడ్లు సక్కగనే కొంటుంటే మధ్యల ఈళ్ల లొల్లి ఏందో అర్థం కాలే.- కొడిదల జయమ్మ, రైతు, పానగల్లు, నల్లగొండ మండలం
ఎప్పటిలాగే సర్కారోళ్లు మా ఒడ్లు మంచిగనే కొంటుండ్రు. పది రోజులైంది సెంటర్లో ఒడ్లు పోసి. తేమ శాతం రాంది ఎట్ల్ల కొంటరు? వచ్చిన దాకా ఎదురు చూశాం. ఇయ్యాలనే నా ఒడ్లు కాంటా వేశారు. యాసంగికి కూడా మా వడ్లు కొనాలి. – వజ్జ మహేందర్, రైతు, ఆర్జాలబావి, నల్లగొండ మండలం
మా దగ్గరకు వచ్చిన బీజేపోళ్లు యాసంగికి కేంద్రం వడ్లు కొంటుందని ముందుగా ప్రకటన చేయించాలి. కొనుగోలు కేంద్రంలో బీజేపోళ్లు రైతులను భయాందోళనకు గురి చేసిండ్రు. – గుండగోని జానయ్య,
రైతు, పానగల్లు, నల్లగొండ జిల్లా