హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్/సికింద్రాబాద్: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యత్నించిన గిరిజన విద్యార్థులపై ఆ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం గిరిజన, లంబాడ విద్యార్థి సంఘాలతోపాటు టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయ ముట్టడికి తరలిరాగా.. బీజేపీ నాయకులు కర్రలు, కాషాయ జెండాలతో వచ్చి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను అరెస్టు చేసి నారాయణగూడ, చిక్కడపల్లి, అబిడ్స్, గోషామహల్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం సభ్యులు శరత్నాయక్ మాట్లాడుతూ.. 2017లోనే జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్లు పెంచాలని సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సర్కారు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని పార్లమెంట్లో కేంద్ర మంత్రి తుడు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా అసత్యపు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నేత పల్లా ప్రవీణ్రెడ్డి, టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, ప్రధాన కార్యదర్శులు తొనుపునూరి శ్రీకాంత్ గౌడ్, గిరిజన నేత రాంబాబునాయక్, కుడుదుల సతీశ్, వీరబాబు, మంద సురేశ్, కృష్ణ, రవి నాయక్, రవితేజ నాయక్, గిరిజన మహిళలు పాల్గొన్నారు. గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరాటే రాజునాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.