ఎనిమిదేండ్లలో కేంద్రం ఇచ్చిందేమీ లేదు: మంత్రి కొప్పుల
నిర్మల్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కార్ దళితులను దగా చేసిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని స్పష్టంచేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని సోమవారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి కొప్పుల ప్రారంభించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో ఆర్టికల్-3ని పొందుపర్చడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని చెప్పారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ఏడేళ్లలో ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే దళితబంధు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం దేశ బడ్జెట్లో ఒక్క పథకాన్ని ప్రవేశ పెట్టలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.