ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 22: బీజేపీ నాయకుల తీరు మొగుణ్ణి కొట్టి మొగశాల కెక్కినట్టుగా ఉన్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. దళితులపై, టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడులుచేయడం.. తిరిగి వారే తమపై దాడులు చేశారని అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం రాత్రి వారు ఇల్లందకుంటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా నినాదాలు చేసినా.. టీఆర్ఎస్ కార్యాలయం నుంచి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు రెచ్చిపోకుండా సంయమనం పాటించారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రెచ్చగొట్టడంతోనే బీజేపీ శ్రేణులు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశాయన్నారు. ప్రచారంలో భాగంగా దళితకాలనీకి వెళ్లి, దళితులను రావాలని కోరితే, వారు రానందునే దళిత ఎంపీటీసీ సభ్యుడు చినరాయుడు, ఇతర దళిత కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం కమలాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు విశ్వనాథ్ యాక్సిడెంట్ చేసి ఒక ఆటో డ్రైవర్ను పొట్టన పెట్టుకున్న కేసులో ఈటల, బీజేపీ నాయకులు అసలు విషయాలను వక్రీకరించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్పై దుష్ప్రచారం చేసి అభాసులపాలయ్యారని గుర్తుచేశారు. ఈ ఘటనలో కూడా బలవంతంగా తీసుకొచ్చిన జనం కూడా వారి ప్రసంగం వినకుండానే తిరిగి వెళ్లిపోవడం బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదని తెలిపారు. చివరకు దాడి చేసి వారే కేసులు బనాయించడం బీజేపీ నాయకులకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. దళితులపై, టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. బీజేపీకి ఓటమి తప్పదని, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వచ్చే వారం రోజులపాటు జాగ్రత్తగా వారి కుట్రలను కనిపెట్టి సంయమనంతో ఉండాలని కోరారు.