హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్లకు నిజామాబాద్ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు షాక్ ఇచ్చారు. సంజయ్ ఆ జిల్లాలో పర్యటించిన 24 గంటల్లోనే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. నందిపేట ఎంపీటీసీ అరుణ చావన్ సహా పలువురు నేతలు ఆదివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాజకీయ లబ్ధికోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్.. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు.
పసుపు బోర్డు పేరుతో గెలిచి, రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని తేల్చిచెప్పారు. తమను ఎంపీ అర్వింద్ మోసం చేశారని రైతులు అవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నందిపేట జడ్పీటీసీ యమున ముత్యం, ఎంపీటీసీ మురళి, టీఆర్ఎస్ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు.