బీజేపీ నాయకులు భారత్లో బలవంతంగా సావర్కర్ ఆలోచనలను అమలు చేస్తున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హిందూత్వ విధానాన్ని ఉపయోగిస్తున్న విధానమే అందుకు ఉదాహరణ. ముస్లింలను రెండో తరగతి పౌరులుగా పరిగణించే పరిస్థితులను బీజేపీ కల్పిస్తున్నది. వారిని శాశ్వత శత్రువులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది అమానుషం కాదా?
హోరాహోరీ పోరు సాగుతుండటం వల్ల గుజరాత్ శాసనసభ ఎన్నికలు ముఖ్యమైనవని అనుకోకూడదు. గుజరాత్లో హిందుత్వ విధానాన్ని, హిందూ మత చిహ్నలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో, భవిష్యత్తులో వాటిని దేశమంతటా ఎలా వినియోగిస్తారో తెలుసుకోవడానికి ఉపయోగపడేవి కాబట్టే, ఈ ఎన్నికలు ముఖ్యమైనవి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్లోని ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ మతపరమైన అల్లర్లలో పాల్గొనేవారికి 2002లో నేర్పిన గుణపాఠం రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పిందని అన్నారు. దేశంలో బలమైన నాయకుడు లేకపోతే, అఫ్తాబ్ పూనావాలా లాంటి వారు ప్రతి నగరంలోనూ పుట్టుకొస్తారని, ముస్లిం యువకులు ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతుల మతం మారుస్తారని, ఆ తర్వాత వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారని అస్సాం సీఎం హిమంత అన్నారు. ఇలాంటి ప్రకటనలు హిందూ గర్వాన్ని, భయాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించినవి. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వహించే వ్యక్తుల నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం వారి సైద్ధాంతిక అహంకారాన్ని తెలియజేస్తుంది.
ఇలాంటి భావాలు ప్రజల్లో ఉన్న ఆర్థికపరమైన అసంతృప్తులను అధిగమిస్తాయని బీజేపీ భావించింది. ఈ ప్రయోగం గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లలో విజయవంతమైంది. కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఉత్తర్ప్రదేశ్ నమూనాను తీవ్రంగా అనుకరించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ రెండు రాష్ర్టాల్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ప్రయోగం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఎన్నికల్లో విఫలమైంది. రాజకీయంగా, మత పరంగా లబ్ధి పొందడమే ఈ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం. గుజరాత్లో అల్ప సంఖ్యాక వర్గమైన ముస్లింలు ప్రజా జీవనంలో తమ ఉనికిని చాటుకోలేకపోతున్నప్పటికీ, వారికి వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం జరగడం విచిత్రం. రాష్ట్ర జనాభాలో 9 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు చాలా తక్కువ. గత 24 ఏండ్లలో బీజేపీ ముస్లింలెవరికీ టికెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ సైతం ముస్లింలకు టికెట్లు ఇవ్వడాన్ని తగ్గిస్తూ వచ్చింది. 2002 అల్లర్లలో పెద్ద ఎత్తున ముస్లింల ఆస్తులను ధ్వంసం చేసి, వారి ప్రాణాలను హరించిన తర్వాత కూడా ఆ మతస్థులను దారుణంగా వెలివేస్తున్నారు. వారిని ఇప్పటికీ శత్రువులుగా పరిగణించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ భావన కొంత వరకు టీవీ ఛానళ్ల ద్వారా వ్యాప్తి చేయబడింది. ఈ విధంగా మీడియాకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లింలను ‘శాశ్వత శత్రువులు’గా చిత్రీకరించడమే ప్రభుత్వ సందేశంగా, ఆదేశంగా తెలుస్తుంది. ఈ క్రమంలో గత ముస్లిం పాలకుల పీడనపై ప్రస్తుతం విచారణ జరపటం, లౌకిక విలువల గురించి మాట్లాడేవారిని ‘ముస్లిం ప్రేమికులు’గా అభివర్ణించడం జరుగుతున్నది.
ఇవాళ భారత్లో బలవంతంగా అమలు చేస్తున్న ఈ ఆలోచనలు వాస్తవానికి వి.డి.సావర్కర్వి. ముస్లింలను దురాక్రమణదారులుగా చూపడం, హిందూ దేశంలో ప్రతీకారం తీర్చుకోవడం, జాతీయ గౌరవం పొందాలనుకోవడం ఆయన ఆలోచనలు. హిందువులందరూ తమను తాము తీర్చిదిద్దుకుని, ఒక యుద్ధ జాతిగా పునర్జన్మ పొందాలని తాను కోరుకుంటున్నానని సావర్కర్ అన్నారు. ఆయన ఆలోచనలు గాంధీ ప్రవచించిన అహింసకు పూర్తిగా విరుద్ధం. గుజరాత్, యూపీ లాంటి రాష్ర్టాల్లో ముస్లింలు ఇప్పటికే రెండో తరగతి పౌరులుగా జీవిస్తున్నారు. ఇదే పరిస్థితి దేశమంతటా తీసుకొస్తారా? తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తారు? ఒక వర్గాన్ని ఓడించిన తర్వాత ఎంత కాలం మీరు ఆ వర్గాన్ని శాశ్వత శత్రువుగా చిత్రీకరిస్తారు? 370 అధికరణను రద్దు చేశారు, కశ్మీరీల ఆకాంక్షలను చిదిమేశారు, దేశ చరిత్రలో అత్యంత ప్రముఖమైన బహిరంగ కూల్చివేత జరిగిన అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నారు. అస్సాంలో నిరంతరం నిర్భంధం కొనసాగుతున్నది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధారాల వేట కొనసాగుతున్నది. ఇంకేం మిగిలి ఉంది? అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్… ఇప్పుడు అఫ్తాబ్ పూనావాలా?
(వ్యాసకర్త: జర్నలిస్టు, రచయిత)(దక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో..)
-సభా నఖ్వీ