Gujarat BJP | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన మంత్రులు, ఎమ్మెల్యేలనే నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరనున్న పలువురికి టికెట్లిచ్చిన బీజేపీ అధిష్టానం.. 84 మంది సిట్టింగులకు టికెట్లు నిరాకరించింది. వీరిలో ఐదుగురు మంత్రులు కూడా ఉండటం విశేషం. ప్రస్తుత స్పీకర్ నిమాబెన్ ఆచార్లకు కూడా బీజేపీ మొండి చేయి చూపింది. ఐదేండ్ల క్రితం అనూహ్యంగా అధికార పీఠాన్నెక్కిన భూపేంద్ర పటేల్.. తిరిగి ఘట్లోధియా నుంచి బరిలో దిగుతున్నారు. టికెట్లు రానివారిలో చాలా మంది ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది. ఐదుగురు సీనియర్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 1, 5 తేదీల్లో జరుగనున్నాయి. తొలి దశలో 89 స్థానాలు, మలి దశలో 93 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 182 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితా 160 స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థులను గురువారం ప్రకటించింది. పటేల్ క్యాబినెట్లో ఉన్న రాజేంద్ర త్రివేది, ప్రదీప్ పర్మార్తోపాటు మరో ముగ్గురు మంత్రులకు టికెట్లు నిరాకరించారు. మొత్తం 84 మంది సిట్టింగులు టికెట్లు కోల్పోయారు. వీరంతా నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటిస్తున్నారు.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ స్థానంలో డాక్టర్ దర్శిత షా రాజ్కోట్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. మోర్బీలో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టిన కమలనాథులు.. మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు టికెటిచ్చారు. మోర్బీ వంతెన ఘటనలో పలువురిని రక్షించడంతో వంతెన కూలడంతో పోయిన పార్టీ పరువును కాపాడారని ఆయనకు టికెట్ కేటాయించినట్లుగా గుజరాత్ బీజేపీ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ మంత్రులు ప్రదీప్ సింగ్ జడేజా, భూపేంద్రసింగ్ చుడాసామా, సౌరభ్ పటేల్, రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు ఆర్సీ ఫల్లు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబ జడేజా జామ్నగర్ నార్త్ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన హార్దిక్ పటేల్ విరాంగమం నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రద్యుమన్ సింగ్ జడేజా (అబ్దాసా), కువర్జీ బవ్డియా (జస్దాన్), జవహర్ చావ్డా (మానవదార్), హర్షద్ రిబ్దియా (విసావదార్), భాగ బరాద్ (తలాలా), అశ్విన్ కొత్వాల్ (ఖేద్బ్రహ్మ), జితు చౌదరి (కప్రదా) లకు టికెట్ కేటాయించారు. ఈ నేతలంతా 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచారు.