టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
సుబేదారి(హనుమకొండ), మే 8: ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాదిగలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని వడ్డేపల్లిలో నిర్వహించిన వరంగల్ పార్లమెంటరీ స్థాయి సదస్సుకు వంగపల్లి హాజరై, మాట్లాడారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల వారీగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని ఎస్సీ వర్గీకరణ చేయకుండా నమ్మించి మోసం చేసిన బీజేపీకి మాదిగలు ఓటుతోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మనువాద సిద్ధాంతాన్ని అమలుచేస్తున్న ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఉన్న బీజేపీ, గాంధీభవన్లో మాదిగ బిడ్డలను పొట్టపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మొదటి శత్రువులని చెప్పారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు మూడేళ్లు దాటినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.