హుజురాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గొడిశాల పావని గౌడ్ వాహనంపై బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు బుధవారం సాయంత్రం హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామం సమీపంలో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. బుధవారం రాత్రి ఆయన ఢిల్లీ నుండి విలేకరులతో మాట్లాడారు.
ఒక మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో ప్రచారానికి పావని గౌడ్ మరియు మహిళా కార్యకర్తలు వెళ్లి వస్తున్న తరుణంలో బిజెపి నాయకులు రౌడీల్లా వ్యవహరించి పావని గౌడ్ పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో పావని కి చెందిన కారు ధ్వంసం అయిందని ఆయన వివరించారు. హుజూరా బాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు బాటలో ఉండటాన్ని జీర్ణించుకోలేని బిజెపి నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు. బిజెపి దాడులను తిప్పి కొట్టాలని ఆయన పేర్కొన్నారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తలుచుకుంటే ఏ ఒక్క బీజేపీ నాయకులు కూడా తిరగలేరని కానీ అలాంటి సంస్కృతి తమ పార్టీలో లేదని ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు ఎంతవరకు సమంజసం బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ముందు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఇలాంటి చర్యలకు దిగితే సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం ఖాయమని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పోలీసులు ఈ విషయమై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.