హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ రెండూ అన్నదమ్ములని, ప్రభుత్వ సంస్థలను అమ్మి కార్మికులను రోడ్డున పడేస్తున్నాయని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కార్మికశాఖ బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, ఆయన తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెరిగాయని, ఫలితంగా ఉపాధి కల్పన పెరిగిందని చెప్పారు. ఫలితంగా దేశంలో కూలీ బిడ్డలకు తెలంగాణ అడ్డాగా మారిందని అన్నారు. తెలంగాణ రాకముందు నీళ్లు, కరంటు లేక పరిశ్రమలు మూత పడేవని, ఉపాధి కోల్పోయి కార్మికులు అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం 15-18 రాష్టాల నుంచి 30 లక్షల మంది కార్మికులు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారని, వారికి హైదరాబాద్తోపాటు వరంగల్, సిద్దిపేట పట్టణాలకు, మారుమూల గ్రామాల్లో సైతం పని దొరుకుతున్నదని చెప్పారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తొమ్మిది రకాల సహాయాలు చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, రాష్ట్రంలో 12.66 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. 9.56 లక్షల మంది కార్మికులకు రూ.18.45 కోట్ల వివిధ రకాల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ప్రమాద బీమాను రూ. 2 లక్షలనుంచి రూ. 6 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. సెక్యూరిటీ వర్కర్స్కు వేతనాల పెంపుపై సమీక్ష చేస్తామన్నారు.