భారత్ బయోటెక్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): క్షయ వ్యాధి నిరోధానికి త్వరలో ఓ టీకాను అందుబాటులోకి తేనున్నామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. స్పెయిన్కు చెందిన బయోఫ్యాబ్రీ భాగస్వామ్యంతో టీబీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెయిన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, క్షయ వ్యాధి అధికంగా ఉన్న భారత్, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని మొత్తం 70 దేశాలకు ఈ వ్యాక్సిన్ను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసుల్లో దాదాపు 25 శాతం ఈ దేశాల్లోనే ఉన్నట్టు భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఈ వ్యాక్సిన్కు సంబంధించి ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ సఫలమయ్యాయని, రానున్న కొద్ది నెలల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. అల్పాదాయ దేశాల్లో తక్కువ ధరకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ఒప్పందం దోహదపడుతుందని బయోఫ్యాబ్రీ సీఈవో ఎస్టెబాన్ రోడ్రిగ్స్ తెలిపారు.