న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నది’ ఇది బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబసభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల విడుదలను సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సారాంశం. అయితే గుజరాత్ ప్రభుత్వం చెప్పిన దోషుల ‘మంచి ప్రవర్తన’ ఎంతమాత్రమో పెరోల్పై ఉన్న సమయంలో వారిపై నమోదైన కేసులు, పోలీసులకు అందిన ఫిర్యాదులను చూస్తే తెలుస్తున్నది. దోషులను విడుదల చేసేందుకు ‘సత్ప్రవర్తన’ అంటూ గుజరాత్ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందనే చీకటి నిజం తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ విచారణలో తేలింది. ముందస్తు విడుదలకు ముందు 11 మంది దోషులు వెయ్యి రోజులకు పైగా పెరోల్పై బయట ఉన్నారు. ఈ సమయంలో వారు సాక్షులను బెదిరించారని, వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎఫ్ఐఆర్లు కూడా నమోదయినట్టు వెల్లడైంది.
ఫిర్యాదులు.. ఎఫ్ఐఆర్లు..
రేపిస్టులనూ వదిలి పెడుతున్నారు: ఒవైసీ
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశం చిరుతలను వదులుతున్నదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. చిరుతలతో పాటు రేపిస్టులను కూడా వదిలిపెడుతున్నారని చురక అంటించారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో ‘డిఫెన్స్ ఎక్స్పో-22’ను మోదీ ప్రారంభించారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు గత ఎనిమిదేండ్లలో 8 రెట్లు పెరిగాయని మోదీ పేర్కొన్నారు. మేకిన్ ఇండియాతో అంతర్జాతీయంగా రక్షణ రంగంలో భారత పరపతి పెరుగుతున్నదని చెప్పేందుకు ప్రయత్నిస్తూ.. ఒకప్పుడు గాల్లోకి పావురాలను వదిలిన భారత దేశం నేడు చీతాలను వదిలే స్థాయికి ఎదిగిందన్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మోదీ చెప్తున్నట్టుగా దేశం చీతాలతోపాటు రేపిస్టులను కూడా స్వేచ్ఛగా సమాజంలోకి వదిలిపెడుతున్నదని నిప్పులు చెరిగారు. బిల్కిస్ కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒవైసీ ఈ విమర్శలు చేశారు.