పట్నా: బీహార్లో గత కొన్నేండ్లుగా సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దాంతో అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. పోలీసులు ఎంత పకడ్బందీగా తనిఖీలు చేపట్టినా దొంగచాటుగా కల్తీ మద్యం సరఫరా జరుగుతూనే ఉన్నది.
ఈ క్రమంలో తరచూ కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సరాన్ జిల్లా ఛాప్రా ఏరియాలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందగానే తాము ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, మరికొంత మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైనట్లు తెలిసిందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.