కీవ్, ఫిబ్రవరి 21: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైందన్న వార్తలు సోమవారం గుప్పుమన్నాయి. తమ దేశంలోకి చొరబడి, విధ్వంసానికి యత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్టు రష్యా ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఘటనలో తమ సైనికులెవ్వరూ గాయపడలేదని వెల్లడించింది. తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలను మోహరించిందని ఆరోపించింది.
జవాన్లను హతమార్చామన్న రష్యా ప్రకటనను ఉక్రెయిన్ ఆర్మీ ఖండించింది. తమ సైనికులు చొరబాటుకు యత్నించలేదని, రష్యా ప్రకటించినట్టు తమ జవాన్లు ఎవ్వరూ మరణించలేదని వెల్లడించింది. సరిహద్దుల్లో తాము కాల్పులకు ఒడిగడుతున్నామన్న రష్యా వాదనలను కూడా కొట్టిపారేసింది. రష్యా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించింది. తమ సైనికులకు అపాయం తలపెడితే ఊరుకోబోమని హెచ్చరించింది. తమ దేశంపై దాడులు చేయడానికి కాచుక్కూర్చున్న రష్యాను నిలువరించాలని, ఈ మేరకు బుడాపెస్ట్ ఒడంబడికలోని ఆర్టికల్ 6 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి (యూఎన్ఎస్సీ) ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది.
పుతిన్ రెచ్చగొట్టే ప్రకటన
తూర్పు ఉక్రెయిన్లోని డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ (డీఎన్ఆర్), లుగాంస్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్ఎన్ఆర్)ను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించే యోచనలో ఉన్నట్టు పుతిన్ సోమవారం ప్రకటించారు. రష్యా తాజా ప్రకటన ఉక్రెయిన్ను మరింత ఆగ్రహానికి గురిచేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సంప్రదింపులు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు పాల్పడకపోతేనే ఈ చర్చలు జరుపుతామని శ్వేతసౌధం నిబంధన విధించింది.