‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ‘మా’ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ఏఐజీ ఆసుప్రతి వారు అంతర్జాతీయ స్థాయిలో చికిత్సనందిస్తున్నారని, ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డిగారు సేవా భావానికి నిదర్శమని కొనియాడారు. ‘మా’ ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగానే మరో ఆరు నెలల్లో ‘మా’సొంత భవనానికి భూమిపూజ చేయబోతున్నామని మంచు విష్ణు తెలిపారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరల విషయంలో కావాలనే తాను మౌనంగా ఉన్నానని చెప్పారు. టికెట్ రేట్ల నిర్ణయం చాలా పెద్ద అంశమని, ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘సినిమా టికెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. నేడు టికెట్ రేట్ల వల్ల ఇబ్బందులని అంటున్నారు. పెంపు ఎందుకు అవసరమనే విషయంలో ఇండస్ట్రీలో చర్చ జరగాలి’ అని మంచు విష్ణు సూచించారు.