భోపాల్: ఒక క్రికెట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన క్రీడాకారుడికి ఐదు లీటర్ల పెట్రోల్ను బహుమతిగా ఇచ్చారు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో ఇది వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కాంగ్రెస్ నేత మనోజ్ శుక్లా ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. సలావుద్దీన్ అబ్బాసి అనే క్రీడాకారుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్ను బహూకరించారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేశారు.
మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పలు చోట్ల వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లీటరు ధర వంద దాటింది. దీంతో భోపాల్లో ఇటీవల ఒక వ్యక్తి క్రికెట్ డ్రెస్లో బ్యాటు చేతపట్టుకుని సెంచరీ కొట్టినట్లుగా పెట్రోల్బంక్ వద్ద నిరసన తెలిపాడు. తమిళనాడులో ఇటీవల జరిగిన ఒక పెండ్లిలో వధువరులకు పెట్రోల్ క్యాన్, గ్యాస్ సిలిండర్, ఉల్లి దండలు బహూకరించారు.