వన్డేలతో పోల్చుకుంటే.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో విండీస్ వీరులు కాస్త పోరాడినా.. రోహిత్ సేన ముందు వారి పప్పులు ఉడకలేదు. మన బౌలర్ల ధాటికి భారీ స్కోరు చేయడంలో కరీబియన్లు విఫలం కాగా.. భారత టాపార్డర్లో తలా కొన్ని పరుగులు చేయడంతో విండీస్కు ఓటమి తప్పలేదు. ఐపీఎల్ వేలంలో భారీ ధర దక్కించుకున్న నికోలస్ పూరన్ అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. అరంగేట్ర మ్యాచ్లో భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కించుకున్నాడు.
కోల్కతా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మొదటి మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. వన్డే సిరీస్లో కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయిన కరీబియన్లు.. పొట్టి ఫార్మాట్లో కాస్త పోరాడినా.. విజయానికి అవసరమైనన్ని పరుగులు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో సిరీస్లో టీమ్ఇండియా 1-0తో ముందంజ వేసింది. మొదట వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇటీవల ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసుకున్న నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు 5 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కైల్ మయేర్స్ (31; 7 ఫోర్లు), కెప్టెన్ పొలార్డ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (35) జట్టుకు బలమైన పునాది వేయగా.. సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేశ్ అయ్యర్ (24 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) మిగిలిన పని పూర్తి చేశారు. రవి బిష్ణోయ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడే రెండో టీ20 జరుగనుంది.
అండర్-19 ప్రపంచకప్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సత్తాచాటి టీమ్ఇండియాకు ఎంపికైన రవి బిష్ణోయ్ బుధవారం మ్యాచ్తో టీ20 అరంగేట్రం చేశాడు. ఆరంభంలో కాస్త తడబడ్డా తొలి మ్యాచ్లో గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. ఒత్తిడి కారణంగా ఆరు వైడ్లు వేసినా.. నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు.మ్యాచ్ ఆరంభానికి ముందు యుజ్వేంద్ర చాహల్.. అతడికి జాతీయ జట్టు క్యాప్ అందించి టీమ్లోకి ఆహ్వానించాడు.
వెస్టిండీస్: 20 ఓవర్లలో 157/7 (పూరన్ 61; రవి 2/17, హర్షల్ 2/37)
భారత్: 18.5 ఓవర్లలో 162/4 (రోహిత్ 40, ఇషాన్ 35; చేజ్ 2/14).