చర్ల, మార్చి 5: ఛత్తీస్గఢ్కు చెందిన ఓ గర్భిణికి ఆపత్కాలంలో అండగా నిలిచారు తెలంగాణ వైద్యులు. గంటల్లో బిడ్డకు జన్మనిస్తుందనుకొన్న మహిళ జ్వరం, ఫిట్స్తో అపస్మారక స్థితికి చేరుకోగా బంధువులు తల్లడిల్లారు. 25 కిలోమీటర్లు అడవిలోప్రయాణించి చర్ల దవాఖానకు చేరుకొన్నారు. అయితే తల్లిలో చలనం లేకపోవటంతో అక్కడి నుంచి భద్రాచలం తరలించగా.. వైద్యులు శ్రమించి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామేడ్ సమీపంలోని అటవీగ్రామం జీడిపల్లికి చెందిన ఎట్టి భీమా భార్య ఎట్టి పొజ్జి గర్భిణి. నెలలు నిండి ప్రసవించేందుకు సిద్ధంగా ఉంది. కాగా, గురువారం ఆమెకు జ్వరం వచ్చింది. వారి గ్రామానికి సమీపంలో దవాఖాన లేదు. వైద్యులూ ఉండరు. దిక్కుతోచని స్థితిలో శుక్రవారం ట్రాక్టర్పై పొజ్జిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని దవాఖానకు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక జ్వరంతోపాటు ఫిట్స్ వచ్చింది. ప్రసవానికి ఇబ్బందులు ఎదురవ్వడంతోపాటు ఆలస్యం చేస్తే తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పుందని భావించిన డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి.. భద్రాచలం ఏరియా దవాఖానకు 108లో తరలించారు. వైద్యులు అతికష్టంమీద తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పొజ్జి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.