వరంగల్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న విధానాలతో పక్క రాష్ట్రంలోని ఉద్యోగులు తెలంగాణలో ఉంటే బాగుండేదని కోరుకొంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి ఆదివారం ఆయన హనుమకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ను ప్రారంభించారు. అనంతరం టీజీవో ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సంఘం ఆఫీస్ బేరర్ల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు.
శంలోనే అత్యధిక పీఆర్సీ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉద్యోగులకు అమలవుతున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉద్యోగులు పోల్చుకొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మూడు డీఏలు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన పీఆర్సీ కంటే మన డీఏలే అధికమని తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేని కొన్ని పార్టీల నాయకులు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మాదిరిగా ఇక్కడి ఉద్యోగులు కూడా ఆగం కావాలని కొందరు కోరుకొంటున్నారని, అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 317 జీవోతో అన్ని ప్రాంతాలకు ఉద్యోగులు, టీచర్ల కేటాయింపులు జరిగాయని చెప్పారు. అందరు ఉద్యోగులు ఒక్క చోట ఉంటే ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టినప్పుడు కొత్త ఉద్యోగాలు ఉండవన్నారు. చిన్నచిన్న సమస్యలను ఆసరాగా చేసుకొని ఉద్యోగాల భర్తీపై కొందరు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకొంటున్నారని, పైగా వారే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు ఉండకుండా చేసేందుకు కొత్త జోనల్ విధానం అమలులోకి తెచ్చినట్టు తెలిపారు.
ఉద్యోగుల కృషితోనే అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేసే విషయంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అధికారులు బాగా అమలు చేయడం వల్ల తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరపున ఎన్నో అవార్డులు వస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. 317 జీవోను కొంతమంది కావాలనే తప్పుబడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవనానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.