బాన్సువాడ, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా సర్కారు దవాఖానల్లో అందిస్తున్నది. వైద్యరంగంలో సమూల మార్పులు తెచ్చి.. సర్కారు దవాఖాన అంటేనే నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుందనే ప్రశంసలు అందుకుంటున్నది. దవాఖానల్లో ఖరీదైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కల్గిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతో సర్కారు దవాఖానల్లోనే సుఖ ప్రసవాలు జరిగేలా కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. తల్లీబిడ్డల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న సర్కారు.. అత్యాధునిక టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. కొంత మంది పిల్లలు పుట్టుకతోనే ఏదోక లోపం కనిపిస్తున్నది. ఈ సమస్యను ముందుగానే గుర్తించేందుకు టిఫా(టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్ దోహదం చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఉన్నా వాటికి టిఫా స్కాన్ తీసే సామర్థ్యం లేదు. దీన్ని గుర్తించిన సర్కారు ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో టిఫా స్కానింగ్ సదుపాయం ఉన్న అల్ట్రాసౌండ్ మెషిన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్లో టిఫా స్కాన్కు రూ.1500-2000 వసూలు చేస్తుండగా గర్భిణులకు ఈ భారం పూర్తిగా తప్పనున్నది.
బాన్సువాడలో..
బాన్సువాడ మాతాశిశు దవాఖానలో ప్రభుత్వం టిఫా స్కానింగ్ మిషన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రారంభించారు. కాగా బాన్సువాడ వంద పడకల మాతాశిశు సంరక్షణ దవాఖానకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు చుట్టు పక్కల రాష్ర్టాలకు చెందిన గర్భిణులు వైద్య సేవల కోసం వస్తుంటారు. రోజుకు సుమారు 300-500 మంది వరకు ఇక్కడ వైద్య సేవలు పొందుతారు. 15 నుంచి 25 వరకు ప్రతి రోజూ డెలివరీలు జరుగుతాయి. వారానికి సుమారు వంద ప్రసవాలు అవుతాయని, నెలకు 300 నుంచి 400 మంది గర్భిణులకు ప్రసవం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జాగ్రత్త పడొచ్చు..
టిఫా స్కాన్ను 18-20 వారాల మధ్య కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 22 వారాల వరకు కూడా చేస్తారు.
ఈ స్కానింగ్లో గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలి వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తారు.
మెదడు, కండ్లు, ముక్కు, నాలుక.. ఇలా ప్రతి అంతర్గత అవయవాన్ని 3డీ, 4డీ ఇమేజింగ్ రూపంలో నివేదికలు తయారు చేస్తారు.
నిపుణులైన రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్ చేస్తారు. ఇందుకు కనీసం 20-30 నిమిషాలు పడుతుంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉన్నది, జరాయువు(మావి) ఏ ప్రాంతంలో ఉన్నది, ఉమ్మి నీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు.
శిశువులో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమై సరిదిద్దే వీలు కలుగుతుంది.
కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చు. ముందే గుర్తించగలిగితే డెలివరీ సమయంలో పీడియాట్రిక్ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చు.
గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం వంటి లోపాలు గుర్తిస్తే ముందుగానే కుటుంబసభ్యులను మానసికంగా సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో శిశువుల ఎదుగుదల సరిగా లేక.. పుట్టగానే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా నయంకాని వ్యాధులు, ఎక్కువకాలం బతకలేని వ్యాధులను గుర్తిస్తే ముందుగానే న్యాయపరంగా అబార్షన్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ ప్రసవానికి సాధ్యమా? సిజేరియన్ చేయాలా? అనేది నిర్ణయించవచ్చు.
టిఫా ఉపయోగం..
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 7శాతం శిశువుల్లో లోపాలు ఉండే అవకాశం ఉన్నది. పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు శారీరకంగా ఏదో ఒక లోపంతో పుడతారు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భధారణ నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, సరైన పోషకాహారం లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాలతో శిశువుల్లో లోపాలు తలెత్తుతాయి. ఇందులో అత్యధికశాతం ముందే గుర్తిస్తే నయం చేయగలిగేవే. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్తో గుర్తించే అవకాశం ఉంటుంది.