విధి నిర్వహణకు సేవాగుణం తోడైతే ఉద్యోగం ఓ సామాజిక బాధ్యతలా అనిపిస్తుంది. కాబట్టే ఆఫీసుకు వెళ్లామా, లంచ్ బాక్స్ ఖాళీ చేశామా, ఇంటికొచ్చామా.. అన్న ధోరణికి భిన్నంగా పనిలోనే ఆనందాన్నీ, సంతృప్తినీ పొందుతూ ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డును అందుకున్నది వనపర్తి పోస్ట్ ఉమెన్ శ్రుతి.
వనపర్తి జిల్లా చీమనగుంటపల్లికి చెందిన నాగమణి, గోపాల్రెడ్డి దంపతుల పెద్ద కూతురు శ్రుతి. పోటీ పరీక్షలో నెగ్గి.. పోస్ ్ట ఉమెన్గా ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం వనపర్తి హెడ్ పోస్టాఫీసులో పనిచేస్తున్నది. కరోనా సమయంలో వృద్ధులకు, రోగులకు, వయోభారంతో ‘ఆసరా’ డబ్బు తీసుకోవడానికి రాలేనివారికి, రైతుబంధు లబ్ధిదారులకు, కేసీఆర్ కిట్ మంజూరైన బాలింతలకు.. నేరుగా తనే ఇంటికి వెళ్లి సేవలు అందించింది. ఉత్తరాల బట్వాడాలోనూ శ్రుతి కచ్చితంగా ఉంటుంది. సకాలంలో లేఖలు అందిస్తుంది. ఆ చిత్తశుద్ధికి తపాలా శాఖ ఉన్నతాధికారుల మన్ననలు పొందింది. ఇటీవల ‘బెస్ట్ ఉమెన్ ఎంప్లాయీ’గా డాక్ సేవా అవార్డునూ అందుకున్నది. ఈ పురస్కారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రదానం చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సన్మానించి అభినందించారు. పోస్టాఫీసు అంటే.. మునుపటిలా కార్డులు, స్టాంపుల విక్రయానికే పరిమితం కావడం లేదు. రాఖీ కవర్లు, గంగా జలం, వివిధ దేవస్థానాల పూజా టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ఆ వ్యాపార లక్ష్యాలనూ సునాయాసంగా అధిగమిస్తున్నది శ్రుతి. ‘ఉద్యోగంలో చేరిన కొత్తలో నాన్న సాయం తీసుకునే దాన్ని. ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నా. అందరూ ప్రేమగా పలకరిస్తుంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని అనిపిస్తుంది’ అంటున్నది శ్రుతి.
రాందేని చంద్రమౌళి