1980 కాలం నాటి పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్టూవర్టుపురం దొంగ’. ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ ఉపశీర్షిక. శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. కె. ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీపావళి సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్లుక్ను విడుదలచేశారు. పొడవాటి గడ్డం, కేశాలంకరణతో రెండు తుపాకులను చేతిలో పట్టుకొని సీరియస్ లుక్లో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆయన కనిపిస్తున్నారు. ‘1980 బ్యాక్డ్రాప్లో సినిమా సాగుతుంది. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్నాం. రాబిన్హుడ్, టైగర్ నాగేశ్వరరావుగా పేరుగాంచిన అతడు చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేవాడు. నాగేశ్వరరావు పాత్ర కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన లుక్ మొత్తాన్ని మార్చుకొని కొత్తగా కనిపించబోతున్నారు. హీరోయిజం, ఎమోషన్స్, యాక్షన్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు, కళాదర్శకత్వం: ఏ.ఎస్ ప్రకాష్.