హైదరాబాద్: చైనాలోని బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత బీజింగ్ జాతీయ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. వారం రోజులపాటు జరగనున్న ఈ క్రీడల్లో 90 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు. ఏడు క్రీడాంశాల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు సాగనున్నాయి. కరోనా నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం విదేశీ వీక్షకులకు అనుమతి నిరాకరించింది. ఇప్పటికే కర్లింగ్, లూజ్, స్కై జంపింగ్, అల్పైన్ స్కీయింగ్, ఫ్రీస్టయిల్ స్కీయింగ్, ఐస్ హాకీ, స్కై జంపింగ్ విభాగాల్లో పోటీలు మొదలుకాగా.. శనివారం పతకాల ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి.
కాగా, ఈ వేడుకల్లో భారత్ నుంచి ఒకే ఒక్క అథ్లెట్ పాల్గొంటున్నాడు. జమ్ము కశ్మీర్కు చెందిన ఆరిఫ్ ఖాన్ (Arif Khan).. స్కీయింగ్లో పోటీపడుతున్నాడు. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ విభాగాల్లో ఆరిఫ్ బరిలోకి దిగనున్నాడు. వింటర్ ఒలింపిక్స్లో భారత్ 1964 నుంచి పాల్గొంటున్నది. అయితే 2002 తర్వాత దేశం నుంచి ఒక్కరే పాల్గొనడం ఇదే మొదటిసారి.
ఒలింపిక్స్కు బీజింగ్ ఆతిథ్యం ఇవ్వడి గత 14 ఏండ్లలో ఇది రెండోసారి. 2008లో వేసవి ఒలింపిక్స్ జరిగాయి. కాగా, వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను భారత్ బహిష్కరించింది. ఒలింపిక్స్ టార్చ్బేరర్గా గల్వాన్ ఘటనతో ప్రమేయం ఉన్న ఆర్మీ అధికారిని చైనా ఎంపిక చేయడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నది.