పొగమంచులో ప్రయాణం ప్రమా దకరం.. వాహనదారులు ఆదమరిచారో అంతే.. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. శీతాకాలంలో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతాయి. మంకర దట్టంగా కమ్మేస్తుంటుంది. ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. రాష్ట్ర రోడ్డు భద్రతా విభాగం సైతం నవంబర్-ఫిబ్రవరి మధ్య నెలల్లో పొగమంచు కారణంగా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించింది. అయితే హైవేపైనే అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి.
వనపర్తి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాను పొగమంచు కమ్మేస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వనపర్తి జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లు ఉండగా ఇందులో పెబ్బేరు సర్కిల్ పరిధిలో జాతీయ రహదారి-44 ఉన్నది. అయితే ఉదయం సమయంలో మంకర దట్టంగా కమ్ముకొని ఉంటుండడంతో ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై పొగమంచు ఏర్పడుతుంది. ఈ సమయాల్లో ప్రయాణం ప్రమాద భరితంగా మారే అవకాశం ఉన్నది. వాహనాల నుంచి వెలుపడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారుతుంది. రహదారి ఐదారు మీటర్ల దూరం వరకు కనిపించని పరిస్థితి. వాహనానికి లైట్లు వేసుకున్నా కొంత దూరంలో ఉన్న వాహనం కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించదు. ఈ సమయంలో వేగంగా ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు. వాహనాల నుంచే వచ్చే పొగతో మంచు ఎక్కువగా ఉంటుంది. పైకిలేచిన దుమ్ము, ధూలి రేణువులపై గాలిలోని తేమ సాంద్రీకరణ చెంది పేరుకుపోయి అత్యధికంగా కనిపిస్తుంది. క్రషర్లు, పరిశ్రమలు, రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలతోపాటు ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల పరిసర ప్రాంతాలు మసకబారుతాయి. అయితే వాహనదారులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పరిమితవేగంతో ప్రాణాలకు రక్షణ
శీతాకాలంలో తెల్లవారుజామున ఎక్కువగా ప్రమాదాలు జ రుగుతుంటాయి. ఇందుకు మితిమీరిన వేగమే కారణం. పొగమంచు సమయంలో వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లినా చాలా దూరం వరకు చూడలేం. డ్రైవింగ్ సమయంలో తక్కువ స్పీడ్లో ఉంటే సడెన్గా ఏదైనా కనబడితే బ్రేక్ వేసి నియంత్రణలోకి తీసుకోవచ్చు. అధిక వేగంలో ఉన్న వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్ల బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ఘటనలు జరుగుతాయి. ఈ క్రమంలో విలువైన ప్రా ణాలు కోల్పోతారు. అందుకే చలికాలంలో డ్రైవింగ్ చేసేప్పుడు వాహనాల హెడ్లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్లైట్లు వేసుకోవాలి. స్పీడు కాదు ప్రాణాలే ముఖ్యమని ప్రతి వాహనదారుడు గుర్తించాలి.