BCCI | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) త్వరలో సెలక్షన్ కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నది. ఇందు కోసం క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) అభ్యర్థులకు ఇంటర్వ్యూలను ప్రారంభించింది. సమాచారం ప్రకారం.. అజయ్ రాత్రా, అమయ్ ఖుర్సియా, ఎస్ శరత్ తదితర మాజీ ఆటగాళ్లు సెలక్షన్ కమిటీలో చోటుకోసం పోటీపడుతున్నారు. అలాగే సీఏసీ చేతన్ శర్మ, హర్విందర్ సింగ్లను సైతం ఇంటర్వ్యూ చేసింది. సెలక్షన్ కమిటీ చైర్మన్గా చేతన్ శర్మను తిరిగి తీసుకోవడం ఖాయమన్నట్లు వార్తలు వస్తున్నాయి.
షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్యానెల్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వగా.. ఈ వారంలో బోర్డుకు సీఏసీ సిఫారసులను అందించనున్నారు. సెలక్షన్ కమిటీకి పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఈస్ట్జోన్కు చెందిన మాజీ భారత ఓపెనర్ ఎస్ఎస్దాస్ సైతం ఉన్నారు. సౌత్ జోన్ నుంచి సునీల్ జోషి స్థానంలో తమిళనాడు మాజీ బ్యాట్స్మెన్ శరత్ గట్టిపోటీ ఇస్తున్నాడు.
ఇక ఈస్ట్జోన్ నుంచి దేబాశిష్ మొహంతి స్థానంలో దాస్ను ఎంపికయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. దేబాశిష్, శరత్ కలిసి భారత్, ఒడిశా తరఫున క్రికెట్ ఆడారు. మరో వైపు ఖాళీగా ఉన్న వెస్ట్జోన్ స్థానాన్ని సైతం భర్తీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా గతేడాది చివరలో ఐసీసీ టీ20 వరల్డ్లో భారత జట్టు ప్రదర్శనపై ఇటీవల బీసీసీఐ సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో చేతన్ శర్మను సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సందర్భంగా ప్రపంచకప్కు సంబంధించి రోడ్మ్యాప్పై చర్చించారు. పొట్టి కప్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. చివరిసారిగా సెలక్షన్ కమిటీ శ్రీలంకతో జరిగే సిరీస్కు జట్టును ఎంపిక చేసింది. భారతజట్టు పాల్గొనే తర్వాతి సిరీస్కు ముందు కొత్త సెలక్షన్ కమిటీని ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నది.